హైదరాబాద్‌లో మద్యం మత్తులో ఉద్రిక్తత – వాహనాలకు నిప్పు

హైదరాబాద్‌లో మద్యం మత్తులో ఉద్రిక్తత – వాహనాలకు నిప్పు

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఉద్రిక్తతకు పాల్పడ్డాడు. అనుమానితుడైన అంజన్ గౌడ్ పార్క్ చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో రెండు కార్లు, ఒక ఆటో, మూడు బైకులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మెడిసిటీ మెడికల్‌ కాలేజీలో గంజాయి కేసు.. విద్యార్థులే పెడ్లర్లు!

మెడిసిటీ మెడికల్‌ కాలేజీలో గంజాయి కేసు.. విద్యార్థులే పెడ్లర్లు!

మేడ్చల్‌: మేడ్చల్‌ మెడిసిటీ మెడికల్‌ కళాశాలలో గంజాయి కేసులో కొత్త కోణం బయటపడింది. మూడేళ్లుగా కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థులు కూడా గంజాయిని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని హైదరాబాద్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. డ్రగ్స్‌పై ఈగల్‌ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో మెడిసిటీ వైద్య విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు గురువారం పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ టెస్టులో గంజాయి పాజిటివ్‌ వచ్చిన పలువురు విద్యార్థుల్ని డీ-అడిక్షన్‌ సెంటర్‌కు పంపించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏఎన్‌బీ అధికారులకు మరిన్ని విషయాలు తెలిశాయి. సీనియర్‌ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేశారని, వారే వాటిని విక్రయించినట్లు గుర్తించారు. వైద్య విద్యార్థులకు గంజాయి విక్రయించిన డ్రగ్‌ పెడ్లర్‌ బొల్లారానికి చెందిన హరాఫత్‌ అలీఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు అలీఖాన్‌ బీదర్‌కు చెందిన జరీనా బాను నుంచి గంజాయిని కొనుగోలు చేసి.. వైద్య విద్యార్థులకు అమ్ముతున్నట్లు పోలీసులు చెప్పారు.